Thursday 23 February 2017

ఈనాటి స్త్రీ శోకం ఆరని అగ్నికణం

ఓం శ్రీ సాయిరాం
ఈనాటి స్త్రీ శోకం ఆరని అగ్నికణం

పల్లవి:
పొత్తిళ్ళలో మొగ్గే తొడిగి ఓ కొమ్మలో పూచిన పువ్వే
కొమ్మా కంచె తల్లీ తండ్రిగా కన్నవారి కలలే పండగా


అను పల్లవి:
ఎదిగిందీ పసిపువ్వే విరిసిన మల్లియగా
వనమంతా తానే వెన్నెలగా నిశీధిలో వెలిగే పున్నమిగా 
||పొత్తిళ్ళలో||

చరణం: 1
కన్నవారి ప్రేమలో కలలు గన్న ఆశలో 
యవ్వనాలు పూచె ఈ మల్లె పువ్వులో
పూవులోని గంధము పరిమళింప చేయగా
విస్తరించెనంతము వీచు గాలిలో
వెదికే దిశలో ఉరికే కసిలో
విహరిస్తూ వచ్చాయి రాక్షస భ్రమరాలు
వనమంతా తామే రాజులుగా
వెదకంగా యవ్వన కుసుమాలు
||పొత్తిళ్ళలో|| 

చరణం: 2
సంధ్యవేళ సూర్యుడు మబ్బుచాటు చంద్రుడు
మూగ బోయి ప్రకృతి కళ్ళు మూయగా
గూడు చేరు వేళలో గుంపుచేరి భ్రమరాలు
ఒంటరైన పువ్వుపై వాలిపోవగా
ప్రమిదే విరిచి చమురే తీసి 
వెలుగొందే దీపాన్ని ఆరిపి వేసాయి
అది చూసి భారతి ఏడ్చింది
తన ఒడిలో కాంతను చేర్చింది 
||పొత్తిళ్ళలో|| 

చరణం: 3
ఓ కొమ్మలో పూచిన పువ్వులు
వనదేవతే తల్లిగ ఎదిగీ
వావి వరస మరిచే పోయెనా
మానవతను చెరిపే వేసెనా
ఈనాటి స్త్రీ శోకం ఆరని అగ్ని కణం
వెలిగిస్తే వెలుగును పంచేను
ఆర్పేవో హారతి దహియించు 
||పొత్తిళ్ళలో||  

గమనిక:  తల్లిదండ్రులు కలలు గన్న మరియు తమ కలలు, ఆశయాలు తీరకుండానే కొందరి రక్కసి మూకల కామదాహానికి బలైపోయిన ఎందరో సోదరీమణులు భరతమాత ముద్దు బిడ్డలు ఆ తల్లి ఒడిలో విగత జీవులై మిగిలిపోయారు. ఆ తల్లి గర్భశోకం తీర్చే తనయుడిగా ఈ పాటను స్త్రీలందరికీ అంకితమిస్తున్నాను.జై హింద్.

-- రెడ్లం చంద్రమౌళి

పలమనేరు