Saturday 16 November 2019

జీవితానికి రెండు సూక్తులు

ఓం శ్రీ సాయిరాం
జీవితానికి రెండు సూక్తులు


కొన్ని అనుభవాలు 
కొన్ని పాఠాలు 
మరికొన్ని మాటలు 
ఇవే మనిషి జీవితానికి స్పూర్తినిచ్చే దాతలు

***

విన్న నిజం కన్నా పొందిన అనుభవం గొప్పది 
కొన్న చదువు కన్నా నేర్చుకున్న పాఠం గొప్పది
మనసును తాకే ప్రతి మంచి మాట మార్గాన్ని చూపే బాటౌతుంది.


రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

Tuesday 8 October 2019

అందమైన కందాలు

ఓం శ్రీ సాయిరాం
అందమైన కందాలు 



కం. వందనము తెలుగు తల్లీ 
అందరమూ జేతులెత్తి దండము సేయన్
కందమునేమని చెప్పుదు
సుందరముగ పాదమమరె సొగసుల తోడన్


కం. జయము జయము గురువులకును
దయతో భారతి వచింప పలికిన కందం
లయ జేతును మీ తోడుగ
నయమే నే  మేలుకొంటి నలుగురితోడన్


కం. కలగా మిగిలిన కందము
జల జలమని వలచి వచ్చి ఝరిలో జేరెన్
ఇలపై నిలవని మనసున
తొలగాలిక తెరలమబ్బు తరుణంబిదియే

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

Monday 7 October 2019

కంద పద్యం

ఓం శ్రీ సాయిరాం

కంద పద్యం



కం. వచ్చిన స్వాతంత్ర్యమ్మును 
ముచ్చటగా జరుపుకొనిరి పుడమిని జనులున్
తెచ్చిన వీరుల గాధలు
మెచ్చుట గాదిది భవితను మేల్కోవలెనన్

   

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

Tuesday 30 July 2019

తొలకరింతలా పలకరించు

ఓం శ్రీ సాయిరాం

తొలకరింతలా పలకరించు




మేఘమా మేఘమా మెరవకే అలా
గాలిలో అలా సాగితే ఎలా
గంగనే నింగిలో దాచుకోకలా
రాళ్ళసీమనే మరిచితే ఎలా
రైతు కంటనీరు పెట్టనీకలా
కారుమబ్బులా ముసిరితే ఎలా
మండుటెండల ఎండిపోయె ఇల
దుక్కిదున్ని ఏతమెత్తి
విత్తునాటిన పల్లెసీమ
రెప్పవాల్చక ఎదురు చూస్తే
పట్టలేదని మరలిపోతివా
నేల కొంగుచాచి అడుగలేదనా
నింగి అంచుదాక ఎగిరిపోతివి
ఎందుకమ్మా ఇంత క్షామం
ఎవరి మీద ఈ ప్రకోపం
నిన్ను నమ్మిన బిడ్డ మీద
నన్ను కన్న గడ్డ మీద
అలక మాని ఇలకు చేరు
వాన నవ్వులా నేల రాలు
తొలకరింతలా పలకరించు

రచన
మీ రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

నీలో ఎందుకింత సందిగ్ధం

ఓం శ్రీ సాయిరాం

నీలో ఎందుకింత సందిగ్ధం


నీలో ఎందుకింత సందిగ్ధం
వదలదు ఏమిటింత గ్రహచారం
ఏదో పొరపాటని అనుకుంటే
కాలం ఆగిపోదు నీకోసం
ఏమీ ప్రయోజనం లేకున్నా
కెరటం ఎగసి ఎగసి పడలేదా
సూర్యుడు ఆదమరచి నిదురిస్తే
వేకువ జాడలేదు మనకోసం
భూమి బ్రమించడం ఆగిందా
లోకం తల్లడిల్లి పోతుంది
గాలి తీసుకుంటె విశ్రాంతి
జీవికి నూకలింక చెల్లేను
పారే ఏరు కదలలేకుంటే
ప్రాణి మనుగడింక సాగేనా
నీలో అగ్గిపుల్ల వెలిగిస్తే
నడిచే దారి నీకు కనిపించు
ప్రాణం నిలిచినంత వరకేగా
గమ్యం చేరుదాక పోరాటం
ఏమీ ప్రయోజనం లేకుండా
ఊరికె ఇచ్చిపోకు నీ ప్రాణం

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Monday 15 July 2019

మది ఊయలై కదలాడెను

ఓం శ్రీ సాయిరాం

మది ఊయలై కదలాడెను




పల్లవి:

చిగురాకులా చిరుగాలికి మది ఊయలై కదలాడెను
తొలి చినుకులా ఈ నేలకి ఒక దేవతే దిగివచ్చెను
తనువార దరిచేరిందని మహుమాటమే పడవద్దని
తొలిసారిగ యదలో ఇలా తన ప్రేమ కురిపించిందని

||చిగురాకులా||


చరణం:1

తామరాకు ఒంటిరంగు ఆమని ప్రేమని
చైత్రమాసం అందుకోసం చక్కగా పూయని
తీయనైన పాటలెన్నో కోయిలా పాడాగా
కొమ్మలన్నీ గాలితాకి లీలగా ఆడగా
సెలయేటి గలగల నవ్వులా నను చేరుకున్నా నువ్వులా
ఆ అందమే ఆనందమై నా గుండెనే చేరిందని

||చిగురాకులా||

 

చరణం:2

రెండు మనసుల కలయికేలే ప్రకృతి పురుషుడు
ఇంత జగము వారి ప్రేమకు సాక్ష్యము
సూర్యచంద్రుల కలయికేలే రోజులు ఋతువులు
కాలమేలే వారి ప్రేమకు సాక్ష్యము
జగమంత నిండిన ప్రేమయే మన ప్రేమకు శ్రీకారము
నా గానము నా గీతము ఈ ప్రేమకే అంకితమని

||చిగురాకులా||


రచన

చంద్రమౌళి రెడ్లం

పలమనేరు

Saturday 13 July 2019

హృదయ కుసుమం

ఓం శ్రీ సాయిరాం

హృదయ కుసుమం





               అవి గాఢ హేమంతపు చలి రాత్రులు, చుట్టూ కమ్ముకున్న చిమ్మ చీకట్లో తెల్లని మంచుగోడలు కట్టుకుని హేమంతం జూలు విదుల్చుతుంది. ఒళ్ళంతా మంచుతో కప్పియున్న ప్రకృతి, భీకరమైన చలి గాలుల తాకిడికి వణికిపోతున్నది. నిశీధి నుండీ మంచు బిందువులు తెరలు తెరలుగా రాలుతూ సన్నని చిరు ఝల్లుల వలే ప్రకృతి ఒంటిపై నుండీ జారి పడుతున్నాయి. జంతువులు, పక్షులు తమ తమ గూటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నాయి. చెట్లు వాటి కొమ్మలు బెరడులు ఆకులతో శరీరాలను కప్పుకుని తీవ్రమైన చలి గాలుల తాకిడి నుండీ తమను తాము కాపాడుకుంటున్నాయి. కానీ ఒక్కచోట మాత్రం ఈ భయంకరమైన వాతావరణాన్ని తట్టుకొని నిలబడిందొక గులాబీ మొక్క. అతడి శరీరం అంతా ఆవరించి ఉన్న సూది మొనల్లాంటి వంపులు తిరిగిన పదునైన నల్లటి కురులు అతడి దేహాన్ని కప్పి ఉంచగా, అదిచూసి వెంటనే అతడిని చుట్టుముట్టి, అమాంతం విరుచుకుపడిందా హేమంతం. కాని ఈ భీకరమైన చలి గాలులు, పొగ మంచు తనని ఏమీ చేయలేవనే తెగింపు అతడి మేనిలో ప్రభవించి కనిపించినట్లనిపించింది ఆ హేమంతానికి. అతడి ద్రుఢ సంకల్పానికి ఏమి చేయలేక అతనిని విడిచి దూరంగా వేళ్ళపోయిందా హేమంతం.


ఇంతలో సూర్యోదయం రానే వచ్చింది. అప్పటి వరకు ప్రకృతిని తన బిగి కౌగిట బంధించిన పొగమంచు ఒక్కసారిగా కరిగి ఇంటి ముందు కళ్ళాపి జల్లినట్లు ప్రకృతి ఒంటిపై చిలకరించి చిన్న చిన్న నీటి బిందువులుగా మారి నేలపై పడి ఇంకిపోయింది. పొద్దు పొడుస్తున్న వేళ కావడంతో నునులేత సూర్యకిరణాల తాకిడికి నవ యవ్వనపు సౌందర్యంలోనికి అడుగులేస్తున్న ఆ గులాబీ మొక్క ద్రుఢమైన శరీరంలో యవ్వనపు సొబగులు మంచులో తడిసిన ముత్యాల వలే మెరిసిపోతున్నాయి. చుట్టూ సూర్యకాంతి వ్యాపించి ఆ వనమంతా ఒక్కసారిగా చలికాచుకుంది. తోటలో ఉన్న పూల మొక్కలు, చెట్లు, జంతువులు, పక్షులు అన్నీ భానుడి కిరణాలు తాకి వెచ్చని స్వాసను పీల్చుకుని ఆస్వాదించాయి. ఇదిలా ఉండగా...


గులాబీ మొక్కకు ఆమడ దూరంలో ముళ్ళ పొదలున్నాయి. ఆ ముళ్ళ పొదలకూ గులాబీ మొక్కకు మద్యలో ఒక సన్నని మల్లె తీగ పాకుతూ పోతున్నది. దాని చుట్టూ వున్న చిన్న చిన్న గడ్డి మొక్కలను ఆసరాగా చేసుకొని పాకుతూ పాకుతూ చివరికి ఒక ముళ్ళ చెట్టు దగ్గరకు వచ్చి చేరింది. అప్పటికే ఆధారంలేక ఎన్నో శ్రమల కోర్చి సుదూర ప్రయాణం చేసి అలిసిపోయిందా మల్లెతీగ. ఎటువెళ్ళాలో తెలియక పక్కనే వున్న ముళ్ళచెట్టును అల్లుకుందామనుకుంటున్న మల్లెతీగను


ఇలా వారించిందా ముళ్ళచెట్టు....


ఎందుకు నన్నల్లుకుంటున్నావ్ ....


నా ఒంటిపైనున్న పదునైన ముళ్ళు చూశావ వాటి ధాటికి నీ శరీరం తాళలేదు. అసలే సుకుమారివి ఎంతో ఎత్తుకు ఎదగవలసిన దానవు ఇంకా మొగ్గైనా తొడగని నునులేత మల్లెతీగవు నావల్ల నీ భవిష్యత్తు నాశనం కాకూడదు, ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకో, ఎప్పుడూ ఒకరి పై ఆధారపడడం కాదు నీకై నువ్వు ఎదగాలి ఎంత ఎదిగినా ఒదిగే స్వభావం వుండాలి అని చెప్పి ఆ లతను సున్నితంగా వారించిందా ముళ్ళచెట్టు.


ముళ్ళచెట్టు మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడిందా మల్లెతీగ అతడి మాటలు ఆమెలో భాధను కలిగించాయి. వెంటనే కోపంతో మారుమాట్లాడక తన దారిని వెదుక్కుంటూ అక్కడి నుండీ వెళ్ళిపోయింది. తరువాత ఆ లత అక్కడకు మరికొద్ది దూరంలో నిర్జీవమైన రాతి బండను అల్లుకుని ఎదుగుతూ వచ్చింది. ఆ రోజు అతడి మాటలు కఠినంగా అనిపించినా ఆలతను ఆలోచింపజేసాయి. ప్రతి రోజూ అతడు చెప్పిన మాటలను తలుచుకుంటూ పెరిగి పెద్దదైంది. అతడి మాటలు ఆమెలో ప్రేరణ కలిగించాయి. తన జీవితాన్ని ప్రేమించడం నేర్పాయి, తనని తాను ప్రేమించుకోవడం నేర్పాయి. ఆమెలోని కలిగిన ఈ రస స్పందనకు అంకురార్పన జరిగింది ఆమాటలతోనే. అంతే ఒక్కసారిగా ఆ లత తన స్పందనలకు కార్యరూపం ఇవ్వాలని తలచి తన ఆలోచనలను అక్షరాలుగా మలిచి సరికొత్త జీవితానికి మార్గ నిర్దేశం చేసుకుంది. తన సుకుమారమైన తీగలతో కలంపట్టి నవ కవితా లోకంలోనికి అడుగులేసింది. తన కమ్మని కథలతో కవితలతో శ్రోతల హృదయాలలో పూష్ప వర్షం కురిపించింది. మునుపెన్నడూ లేని తనను ఇలా చూసుకుంటూ అందుకు కారణమైన అతనికి మనస్సులోనే తన కృతజ్ఞతను తెలుపుకుంది.


ఆ రోజు నుండీ అతనిపై ఆరాధన భావం ఆమెతోపాటే పెరిగి పెద్దదైంది. అది రోజు రోజుకీ మరింత పెరిగి ప్రేమగా చిగురించి మొగ్గతొడిగింది. రోజుకో రెక్కగా విచ్చుకుని పూవుగామారి ప్రేమగా పరిమళించింది. ప్రతి రోజూ ఏదో ఒక విధంగా తన ప్రేమను తెలుపుతూ ఆ ముళ్ళచెట్టుని అల్లుకోవాలని చూసిందా మల్లెతీగ. అది తెలుసుకున్న ముళ్ళచెట్టు అందుకు ప్రతిస్పందనగా తన భావాన్ని ఇలా చెప్పేది


సమయమాసన్నమైనపుడు కాలమే అందుకు బదులు చెబుతుందని....


ఆ మాటలకు , అతడి నిగ్రహానికి నివ్వెరపోయిందా మల్లె తీగ. అతడి పై తన ప్రేమ రెట్టింపై కట్టలు తెంచుకుంది. ఏ గమ్యంలేక ఎటో వెళ్ళిపోవాల్సిన తన జీవితాన్ని నిలబెట్టిన అతడిని పిచ్చి పిచ్చిగా ప్రేమించిందా లత. అతడు ఆమెలో రేపిన ఆ విరహ తాపాన్ని భరిస్తూ ఎన్నో తీయని వెన్నెల రాత్రులను జంటగా గడపాల్సిన తను ఒంటరిగా వృధాగా గడిపేది. ఆమె విరహ తాపాన్నంతా కమ్మని కవితలుగా మలిచి తన ప్రియునికి పవన సందేశం పంపేది. ప్రతి రోజు ఇలా తన ప్రేమ సందేశాన్ని ప్రియునికి తెలిపేది. కాని అప్పటికి ఇప్పటికి అతడి సమాధానం మాత్రం ఒక్కటే అన్నింటికీ కాలమే బదులు చెబుతుందని ఆ మాటలకు ఒక్కోసారి విసిగిపోయినా మరలా అతడిపై తన ప్రేమ ఇంకా రెట్టింపయ్యేది. ఇలాగే చాలా కాలం గడిచింది అయినా వారిరువురి కలయికా ప్రశ్నార్ధకంగా మారింది.


ఒకనాడు గులాబీ మొక్క అతని స్నేహితులతో కలిసి శరత్ కాల పున్నమి వెన్నెలలో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆ రాత్రిని అనుభవిస్తూ సేదదీరుతుండగా ఎక్కడి నుండో ఒక హృదయ రాగం వాళ్ళ చెవుల్లో అమృతం పోసినట్లు వినిపించింది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఆ కోకిల స్వరాన్ని వింటూ ఉండిపోయారు. ఆ రాగం ఒక కమ్మని పాటగా మారి గానం చేస్తూ గాలి పల్లకీ ఎక్కి మత్తైన మల్లెల సువాసనలను వెదజల్లుతూ గులాబీ మొక్కతో సహా అతని స్నేహితులను పరధ్యానంలో పడేసి అలా విహంగంలో సాగిపోయింది. ఒక్కసారిగా ఆ కమ్మని రాగం వీరి స్వాసలో చేరి హృదయాన్ని తాకింది. అంతే అక్కడున్నవారంతా ఆ సుగంధ భరిత మల్లెల సువాసనలో కమ్మని ఆ పాటలో మైమరచిపోయి కాసేపు అలాగే మత్తుగా ఉండిపోయారు. కొద్దిసేపటి తరువాత ఏదో శబ్దానికి అందరూ ఉలిక్కిపడిలేచారు. వెంటనే ఒకరినొకరు చూచుకుని ఎక్కడి నుండి వచ్చిందా కోకిలగానం అని అంతా అనుకున్నారు. ఇలా రోజూ కొంత కాలం గడిచింది.


గులాబీ మొక్క రోజు ఆ మల్లెతీగ మధుర గానం వింటూ తన హృదయంలో ప్రేమ మొగ్గ తొడిగింది అది రోజు రోజుకూ చిగురించి విచ్చుకుని ప్రేమ పరిమళాన్ని వెదజల్లడం మొదలుపెట్టింది ఆ మత్తైన మల్లెల సుగంధంతో గులాబీ పరిమళంతో కలవగానే గులాబీ మొక్క ఒక గొప్ప రసానుభూతికి లోనయ్యేవాడు ఇక తన విరహాన్ని ఆపుకోలేక తన ప్రేయసికి తన పుప్పొడి తో పవన సందేశం పంపింది ఆ పుప్పొడి రేణువులు మెల్లగా మల్లెతీగను వాలి గులాబీ హృదయాన్ని ఆవిష్కరించాయి. అందులో ఇలారాసి ఉంది...


ఓ ప్రేయసీ నా హృదయ వాసీ...


నేను నీ ప్రేమబావిలో పడి మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్నాను ఎందుకంటే నాకు ఈదటం రాదు. అందుకే అందులో ఉన్న ప్రేమామృతాన్ని తాగేసి ఆ మత్తులో నుంచీ ఇలాంటి కవితలు రాస్తున్నాను. నా ప్రేమని అంగీకరించి నన్ను ఈ మహాసముద్రం నుండీ బయటికి తీస్తావో లేక కాదని ఇందులోనే ముంచి సమాధి చేస్తావో అంతా నీదే భారం ప్రియా...


అనుకోని ఈ సంఘటనకు మల్లెతీగ సందిగ్దంలో పడిపోయింది. కాస్త తేరుకొని ఓ హృదయ రాజా నేను నీ ప్రేమ సందేశాన్ని గౌరవిస్తున్నా కానీ నీ ప్రేమను అంగీకరించలేను ఎందుకంటే నా మనసు వేరొకరితో జతపడిపోయింది నా వల్ల ఏదైనా తప్పు జరిగివుంటే మన్నించు నీవు ఎటువంటి విరహ వేదనలో ఉన్నావో నేను కూడా అంతే విరహంతో నా ప్రియుని చేరాలని తపిస్తున్నాను కానీ అతని మనసు ఇంకా కరుగలేదు అందుకోసం నేను ఎన్నాళ్ళైనా నిరీక్షించగలను నా అంతరంగాన్ని అర్థం చెసుకుంటావని మనసార కోరుకుంటూ నీకు నాకన్నా మంచి భాగస్వామి దోరకాలని కోరుకుంటూ మల్లెతీగ తన పుపుపొడిని గులాబీ వద్దకు పంపింది.


ఒక్కసారిగా గులాబి భగ్న హృదయమై వాడిపోయింది తన ముళ్ళతో తన హృదయాన్ని పోడుచుకుని రెక్కలు రాల్చుకుని శిధిలమైపోయి రాలిపోయింది. మళ్ళీ ఏదో ఆశ తన ప్రేయసి మారకపోతుందా అని తనను మేల్కొలుపుకొని పురివిపిప్పిన రోజా తన ప్రేయసికి మళ్ళీ సందేశం పంపింది. మల్లెతీగ మళ్ళీ తిరస్కరించింది మళ్ళీ రోజా ముళ్ళు గుచ్చుకోవడం వాడిపోవడం రాలిపోవడం రోజు ఇది మామూలైపోయింది. ఇలా కొంతకాలం గడిచిన తరువాత మల్లెతీగ మారదని తెలుసుకున్న గులాబీ సందేశం పంపడం మానేసింది తనని ఇంకా బలవంతం చేయాలనుకోలేదు. రాలిపోయిన తన హృదయపు రెక్కలను చూస్తూ కుమిలిపోయింది తరువాత గుండెరాయి చేసుకుంది తర్వాత ఆలోచనలో పడింది నిజం తెలుసుకుని మేల్కొంది.


ప్రేమకు స్పందించని హృదయం కూడా ఒక హృదయమేనా అనుకొని తన ప్రేయసిని వెతుకుతూ పయనమయ్యింది. తనను తానుగా ఇష్టపడే ప్రేయసి కోసం రోజూ కలలు కంటూ తన హృదయ రోజాని వికసింపజేస్తూ పుప్పొడులతో పవన సందేశం పంపుతూ తన ప్రేయసి కోసం ఎదురుచూడసాగింది.


శిశిరం వచ్చిందని వసంతం, కష్టం వచ్చిందని సంతోషం రాకుండా పోతాయా ఒక గులాబీ రాలిపోయిందని ఇంకో గులాబీ రాకుండా పోతుందా, చిగురు తొడగకుండా పోతుందా, ఒక ప్రేయసి కాదంటే ప్రేమ చచ్చిపోయినట్లేనా మనకోసం ఎక్కడో ఒకచోట మన హృదయరాణి పుట్టే ఉంటుంది టైమొచ్చినప్పుడు తప్పక కలుస్తుంది జీవితాన్ని పంచుకుంటుంది అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ప్రేమ పుడుతుంది. అంతేకానీ మనసుకు నచ్చిందని ,కంటికి కనిపించిందంతా మన ప్రేయసి అనుకొని బ్రతకడం మన భ్రమ, నిజం తెలుసుకుని ప్రస్తుతంలో బ్రతకడం నిజమైన ప్రేమికుడి లక్షణం.


రచన

రెడ్లం చంద్రమౌళి

పలమనేరు

Friday 12 July 2019

బృందావన రహస్యం (Historic Scientific Fiction)

ఓం శ్రీ సాయిరాం

బృందావన రహస్యం(Historic Scientific Fiction)







          సాయంత్రం వేణుగోపాల స్వామి ఆలయంలో భజన కార్యక్రమం ముగియగానే స్వామి వారికి హరతి సమర్పించి కృష్ణా... ముకుందా... గోవిందా... అనుకుంటూ భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు శ్రీధరాచార్యులు. ఇంతలో ఉన్నట్టుండి ఈదురు గాలులతో కూడిన భారీవర్ష సూచన కనబడింది. భక్తులందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వారి వారి ఇళ్ళకు పరుగులు తీసారు. ఇంతలో వర్షం రానే వచ్చింది. శ్రీధరాచార్యులు గబగబా గుడికి తాళం వేసి ఇంటికి బయల్దేరారు. మార్గ మధ్యంలో అతని కొడుకు సుదర్శనుడు గొడుగు పట్టుకొని నాన్నగారు అంటూ ఎదురొచ్చాడు. సుదర్శనా ఇంతవర్షంలో నువ్వెందుకొచ్చావు నాయనా... వర్షం పడుతుందని అమ్మ పంపింది నాన్న గారు అన్నాడు. సరే సరే పద పద త్వరగా ఇల్లు చేరాలి వర్షం ఎక్కువవుతున్నది అని ఇద్దరూ ఇంటికి పరుగుతీసారు. అసలే వర్షాకాలం కావడంతో ఉరుములు మెరుపులతో వర్షం బాగా జోరందుకుంది. శ్రీధరాచార్యులు కుమారుడితో సహా ఇల్లు చేరుకున్నారు.



ఇంటికి వచ్చిన భర్తకి భార్య అచ్చమాంబ వేడి వేడిగా కాఫీ ఇచ్చింది. కాస్త సేదతీరాక భార్యతో ఆ మాట ఈ మాట ముచ్చటిస్తూ ఏమేవ్ ఈ పూట వంట ఏంచేస్తున్నావేమిటి, మన సుదర్శనానికి ఇష్టమని దప్పడం చేస్తున్నానండి అంది అచ్చమాంబ ఊ.. కొడుతూ... వర్షం పడుతుండటంతో కరెంటుపోయింది ఇల్లంతా చిమ్మ చీకటి అలుముకుంది. అమ్మా చందన దీపం వెలిగించమ్మా అంది అచ్చమాంబ వంటగది నుండి కూతుర్ని పిలుస్తూ..., అలాగేనమ్మా అంటూ దీపం వెలిగించింది చందన... బయట ఉరుములు మెరుపులతో వర్షం విరుచుకుపడుతోంది మరో పక్క గాలికి కొన్ని చెట్ల కొమ్మలు విరిగి పడుతున్న శబ్ధాలు వినపడుతున్నాయి. హఠాత్తుగా భారీ శబ్ధం ఇంటిల్లిపాదినీ భయాందోళనలకు గురిచేసింది. మనకు దగ్గరలో ఎక్కడో భారీ పిడుగుపడిందని అన్నాడు శ్రీధరాచార్యులు. ఇంటిలోనివారంతా భయబ్రాంతులుకు లోనయ్యారు. ఆ రాత్రంతా కరెంటు రాలేదు సరికదా వర్షం పడుతూనే ఉంది.



తెల్లవారగానే స్నాన సంధ్యాదులు ముగించుకుని, రాత్రి కురిసిన భారీ వర్షం మూలంగా ఊరంతా జలమయం కావడంతో గుడికి కాస్త ఆలస్యంగా బయలుదేరాడు శ్రీధరాచార్యులు, సగం దూరం వచ్చాక, అప్పటికే గుడి తెరవబడి ఊరి జనమంతా గుడిదగ్గర గుమిగూడి ఉండడం చూసాడు, ఏమయి ఉండవచ్చునో అని పరుగు పరుగున వచ్చాడు గుడిదగ్గరకి, అందరిని తప్పించుకొని లోనికి వెళ్ళాడు. ఆలయ ధర్మకత్తలు గుడి తలుపులు తెరిపించి, లోపల ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు. ఏమి పాలుపోలేదు శ్రీధరాచార్యులకి ఏమి విపత్తు సంభవించిందో అని ఆందోళనగా అడిగాడు ధర్మకత్తలని అందులో ఒక ధర్మకర్త మరేం లేదు స్వామి ధ్వజస్తంభం వద్ద భారీ పిడుగు పడి బృందావనం కూలిపోయింది అన్నాడు. ఆ మాటలకు నిర్ఘాంతపోయిన శ్రీధరాచార్యులకి మతిపోయినట్లయింది, వెంటనే తేరుకుని రాత్రి వినిపించిన భారీ విస్పోటనం ఇదేనన్నమాట అని తలుచుకొని అయ్యో అయ్యో ఎంతటి అపచారం జరిగిందని పరుగు పరుగున వెళ్ళి చూసాడు. వారు చెప్పినట్టుగానే బృందావనం విరిగి ఒక వైపుగా ఒరిగి పడిపోయేందుకు సిద్ధంగా ఉంది. వెంటనే వెళ్ళి ధర్మకత్తలతో మాట్లాడి, దానిని సరిచేసే ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించాడు శ్రీధరాచార్యులు. అందుకు ధర్మకత్తల మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని దానిని పునర్నిర్మించాలని సంకల్పించారు.

 

సమావేశం ముగించుకుని గుడిలోనికి వెళ్ళిన శ్రీధరాచార్యులు స్వామివారికి అభిషేకార్చనలు ముగించి అలంకరిస్తుండగా సుదర్శనుడు ప్రసాదం తీసుకువచ్చాడు. స్వామివారికి నైవేద్యం సమర్పించి వచ్చిన భక్తులకు ప్రసాదం పంచిపెట్టారు. ఈలోగా సుదర్శనుడు గుడి ప్రాంగణమంతా కలియతిరిగి తండ్రివద్దకు వచ్చాడు. ఎందుకు నాన్నగారు బృందావనం పడిపోయింది అని తండ్రిని ప్రశ్నించగా రాత్రి పడిన భారీ పిడుగు వల్ల ఇంతటి అపచారం జరిగింది నాన్నా అన్నాడు. ఎందుకు నాన్నా అపచారం మనం కావాలనే చేసిన పని కాదు కదా అనుకోకుండా జరిగింది. అయినా అసలు ఆ బృందావనం గురించి ఇంతగా ఎందుకు చింతిస్తున్నారు అని అడిగాడు సుదర్శనుడు. ఆ వివరాలన్నీ తీరిగ్గా ఇంటికెళ్ళాక చెప్తానులే నాన్నా అని, ఆలయంలో కార్యక్రమాలను త్వరగా ముగించుకొని భోజనానికి ఇంటికి బయల్దేరారు తండ్రీకొడుకులు. అక్కడ అచ్చమాంబ…, భోజనాల వేళయింది వీళ్ళు ఇంకా రాలేదని ఎదురుచూస్తుండగా ఇంటికి చేరుకున్నారు. భోజనాలు ముగించుకొన్న తర్వాత సుదర్శనుణ్ణి పిలిచి ఈ ఆలయ చరిత్రను ఇలా వివరిస్తాడు...

 

నాయనా సుదర్శనా ఈ వేణుగోపాల స్వామి ఆలయం విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని శ్రీ అచ్యుతరాయల వారు నిర్మింపజేసినట్లు చరిత్ర చెప్తున్నది అందుకు నిదర్శనమే ఆలయంలో చెక్కబడిన శిలా శాసనాలు. ఆలయం మొత్తం రాతితో నిర్మించబడింది. ఆలయంలోని శిల్పకళ విజయనగర రాజుల ప్రతిభకు కళా తృష్ణకు నిలువెత్తు నిదర్శనం. వారి ఆలయ నిర్మాణ శైలి, కౌశలం అత్యంత శ్లాఘనీయం. ఈ ఆలయానికొక విశిష్టత ఉంది. వారిచే నిర్మించబడ్డ మిగతా ఆలయాలకు ఈ ఆలయానికి ఉన్న వ్యత్యాసమేమిటంటే, ఈ ఆలయం హంపీ నగరంలోని విరూపాక్షి ఆలయాన్ని పోలివుండడమే ఇందులో విశేషం, అందువలన ఈ ఆలయం ఇంతటి ప్రత్యేకతని సంతరించుకుంది. అందుకే ఈ ఆలయానికి విరూపాక్షి అని కూడా పేరు వచ్చింది. ఆలయంలోని శిల్పసంపద అత్యంత రమణీయంగా చూపరులను ఇట్టే కట్టిపడేసి ఏదో నిగూఢార్థాల్ని చెప్తున్నట్టుగా ఉంటుంది. గర్భాలయం, ప్రవేశమండపం, ధ్వజస్తంభం, రాతిగోపురం, బృందావనం, చుట్టూ రాతితో నిర్మించిన విశాలమైన ప్రాంగణం ఇలా అన్నీ శిల్ప సౌందర్యంతో తొణికిసలాడుతుంటాయి. అందులోకి ఆ బృందావనానికి చెక్కబడ్డ చిన్ని కృష్ణుణ్ణి చూసేవూ వేణువూదుతూ తనతో రాసక్రీడలకు రమ్మని పిలిచినట్లు ఉంటుంది... బృందావనానికి మరో పక్క చెక్కబడ్డ హనుమంతుడు, పండ్లు తింటున్నట్లు అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. రాతి గోపురం గోడలకు ఇరువైపులా సూర్యచంద్రులతో కూడిన రాహుకేతువుల ప్రతిమలను రాతిపై అద్భుతంగా చెక్కారు. చూపరులను అబ్బురపరిచే చారిత్రక నిర్మాణం ఇది, ఇంతకాలమైనా చెక్కుచెదరని పనితనం వారి సొంతం, కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో రాచరికపు చరితలకు ప్రత్యక్ష సాక్షీభూతము ఈ ఆలయం. ఎందరో పర్యాటకులకు ఈ ఆలయ అంగ భంగిమల శిల్ప సౌష్ఠవం కనులవిందుచేస్తుంది అని చెబుతూ ఈ కాలంలో ఇలాంటి నిర్మాణశైలి అసాధ్యం అని ముగించి సాయంకాలం కావస్తుండటంతో గుడికి బయల్దేరాడు శ్రీధరాచార్యులు.... 

 

మార్గ మధ్యంలో ఒక ధర్మకర్త ఎదురుపడి స్వామీ... రేపు బృందావన పనర్నిర్మాణ పనులు చెపడుతున్నాము ఎందుకంటే ఎలాగూ మరో వారం రోజులలో గోకులాష్ఠమి రానే వస్తున్నది అందువల్ల పాత బృందావనాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయించి మరలా పునః ప్రతిష్టాపన జరిపిద్దామని చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీధరాచార్యులు అది విని సరేనని ఆలయానికి వెళ్ళి సాయంసంధ్యా కార్యక్రమాలను యధాతధంగా జరిపించి ఇంటికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు బృందావన పనర్నిర్మాణ పనులు చేపట్టి ప్రతిష్టాపన సాయంకాలనికల్లా పూర్తిచేశారు.

తరువాతి రోజు నుండీ ఆచార్యులు యధావిధిగా బృందావనానికి పూజలు జరిపించేవారు. ఇలా వారం రోజులు గడిచింది గోకులాష్టమి రానే వచ్చింది. ఆలయాన్ని ఊరి వారంతా కలిసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు , ప్రత్యేక పూజలు జరిపించి, అన్నదానాలు, ప్రసాద వితరణలు చేయించారు. గోవులకు పూజలు చేసారు. అన్నీ తానై ఈ కార్యక్రమాన్నంతా దగ్గరుండి నడిపించాడు శ్రీధరాచార్యులు. గుడినిండా ఒకటే కోలహలంగా ఉంది.

 

ఇంతలో సుదర్శనుడు ఇంటి నుండీ తీసుకువచ్చిన అటుకులను శ్రీకృష్ణుడికి ఇష్టమని నైవేద్యంగా సమర్పిద్దామని తీసుకు వచ్చి స్వామివారికి సమర్పిస్తుండగా అది చూచిన శ్రీధరాచార్యులు నాయనా సుదర్శనా కాసిన్ని అటుకులు ఈ ఆకులో తీసుకెళ్ళి బృందావనం వద్ద బాల కృష్ణుడికి కూడా సమర్పించిరా నాయన అని చెప్పాడు. వెంటనే సుదర్శనుడు ఒక విస్తరాకులో దోసెడు అటుకులు పోసి బృందావనం దగ్గర బాలకృష్ణుడి పాదాల చెంత సమర్పించి తిను కృష్ణ తిను నీకు ఇష్టమని అటుకులు తెచ్చాను తిను అని ప్రాధేయపడ్డాడు. సుదర్శనుడు చూస్తుండగానే ఉన్నపళంగా విస్తరాకులో అటుకులన్నీ ఒకదాని వెనుక ఒకటి వరుసక్రమంలో చిన్ని కృష్ణుని పాదాల చెంతకు చేరి ఒకదాని పైకి ఒకటి ఎక్కుతూ కృష్ణుని పాదాలు తాకేటట్లు నిటారుగా నిలబడ్డాయి. ఈ సంఘటనను కళ్ళార్పకుండా చూస్తున్న సుదర్శనుడు హై... హై... కృష్ణుడు నాతో ఆటలాడుకుంటున్నాడని తెగ సంబరపడిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పి తీసుకొచ్చి చూపించాడు, శ్రీధరాచార్యులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆహా ఏమిటీ విచిత్రం ఇన్నాళ్ళ నా అనుభవంలో ఎన్నడూ చూడలేదే ఆహా కృష్ణా అంతా నీ లీల వినోదం అని మనసులో అనుకొని ఆనాటి కార్యక్రమాలన్నీ ముగించుకుని తండ్రీకొడుకులు ఇల్లు చేరారు. శ్రీధరాచార్యులని మాత్రం ఈ సంఘటన ఆలోచింపజేసింది అతను ఇంతకు మునుపు పండగలకి ఎన్నో సార్లు అటుకులు సమర్పించినా ఏనాడు ఈ విధంగా జరగలేదు. ఈరోజేమిటి ఇంత విడ్డూరం ఏదో జరిగిందని ఆ ముకుందుడిని స్మరించుకుని కళ్ళుమూసుకున్నాడు...

 

శ్రీధరాచార్యులు స్వతహాగా ఆగమ, ఆయుర్వేద, జ్యోతిష్య శాస్త్రాలలో ప్రావీణ్యం ఉన్నవాడు. వారి పూర్వీకుల నుండీ ఈ శాస్త్ర పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ఈ ఆలయానికి ఆనాటి రాజుల కాలం నుండీ వీరి పూర్వీకులే అర్చకులుగా పనిచేస్తున్నారు. అయితే ఈ ఆలయానికి విజయనగర రాజులు సమర్పించిన విశిష్టమైన సంపదలు ఇప్పటికీ ఆలయ నేల మాళిగలలో నిక్షిప్తమై ఉన్న సంగతి ఒక్క శ్రీధరాచార్యులకి మాత్రమే తెలుసు. ఎప్పుడైనా విపరీతమైన ఆర్థిక మాంద్యం సంభవించినప్పుడు రాజులు వాటిని తెరిపించి నియోగించేవారని, అవసరం తీరగానే యధాస్తానంలో పెట్టేవారని ప్రతీతి. ఎటువంటి పరిస్థితులలోనూ వాటిని మరే ఇతర కార్యక్రమాలకి వినియోగించరాదని రాజాజ్ఞగా అవి దిగ్భందించబడ్డాయని వారి పూర్వీకుల నుండీ తెలుసుకున్నాడు. అవి ఇప్పటికీ అలాగే చలామణీలో వున్నాయన్న సంగతి శ్రీధరాచార్యులకి తెలుసు అంతేకాకుండా అత్యవసర పరిస్థితులలో బృందావనం కింది భాగంలో ఉన్న భాండారాన్ని వాడేవారని మరలా అవసరం తీరగానే ఆ భాండారాన్ని యధాతధంగా పెట్టేవారని, బృందావనం కింది భాగం నుండీ సరాసరి నేలమాళిగలు చేరుటకు మెట్లున్నాయని శ్రీధరాచార్యుల తండ్రిగారు ఆలయ బాధ్యతను అప్పగిస్తున్నప్పుడు ఈ వివరాలన్నీ విశదపరిచారు.

 

అందుకే ఆరోజు బృందావనం కూలిపోయింది అనగానే శ్రీధరాచార్యులు అంతలా కంగారు పడిపోయాడు. ఈ విషయాలన్నీ ఆలయ ధర్మకత్తలకు తెలియదు. ఇప్పుడు ఇదేదో కొత్త చిక్కు వచ్చిపడిందే అని సతమతమయ్యాడు. శ్రీధరాచార్యులు అలా ఓ రెండు వారాలు గడిచిన తరువాత ఈ ఆలయాన్ని సందర్శించడానికి దేవాదాయ శాఖ వారు వస్తున్నారని ఆలయ ధర్మకత్తలకు వర్తమానం అందింది. ఆ విషయాన్ని ఆచార్యులకి తెలియజేసి, వారికి తగిన ఏర్పాట్లు చేయడానికి సన్నద్దమయ్యారు ధర్మకత్తలు. శ్రీధరాచార్యులుకు ఏమీ అంతుపట్టలేదు. ఈ విషయాలన్నీ వారికి తెలిస్తే ఏం జరుగుతుందోనని మధనపడ్డాడు. సరే నిండా మునిగినాక చలెందుకు గానీ ఎలా జరిగేది అలా జరుగుతుందని అనుకుని అంతా ఆ ముకుందుడి లీలని కుదుటపడ్డాడు.

 

దేవాదాయ శాఖ అధికారులు ఆలయాన్ని సందర్శించారు. ధర్మకత్తలతో సమావేశమై ఆలయం ఆదాయ వ్యయాలను పరిశీలించి ఆలయ కార్యక్రమాలను ఇంత చక్కగా నిర్వర్తిస్తున్న శ్రీధరాచార్యులను అభినందించారు. ఇంతలో ఓ అధికారి ఆలయమంతా కలియతిరిగి వస్తుండగా ఎవరో భక్తుడు బృందావనం వద్ద చిన్ని కృష్ణుడికి అటుకులు పెట్టడం గమనించాడు. అతను చూస్తుండగానే అటుకులు వరుసగా కదులుతూ నిటారుగా నిలబడి కృష్ణుని పాదాలను తాకడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఈ విషయాన్ని మిగతా అధికారులు కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఇంతలో ఒక అధికారి ఇలాంటి సంఘటననే నేను నా స్నేహితుని వద్ద ప్రయోగశాలలో చూసానని అతను డి.ఆర్.డి.ఒ శాస్త్రవేత్త అని చెప్పాడు. అతను వెంటనే ఈ విషయాన్ని డి.ఆర్.డి.ఒ శాస్త్రవేత్తకి తెలియజేసాడు. ఈ విషయం తెలుసుకున్న అతను మరికొంతమంది శాస్త్రవేత్తలతో కలసి మరుసటిరోజు ఉదయానికి హెలీకాప్టర్ లో వెంకటాపురం వేణుగోపాల స్వామి దేవాలయానికి చేరుకున్నారు. ఇవన్నీ ఆచార్యులు చూస్తుండగానే జరిగిపోయాయి. ఏంచేయాలో ఆచార్యులకి దిక్కుతోచలేదు. ఆలయానికి విచ్చేసిన శాస్త్రవేత్తలు ఆచార్యులని వివరాలడిగితే ఆచార్యులు ఇలా చెప్పుకొచ్చారు. ఓ నెలరోజుల క్రితం ఈ బృందావనంపై భారీ పిడుగుపడి బృందావనం ఒకవైపునకు ఒరిగిపోయింది అంతే అప్పటి నుండీ ఇలా జరుగుతుందని చెప్పారు. అయినా శాస్త్రవేత్తలకి ఆచార్యులు ఇంకా ఏదో దాస్తున్నారని అనిపించి మీకు మీ ఆలయానికి ఎటువంటి ఇబ్బంది కలగదు అని భరోసా ఇచ్చి నచ్చజెప్పి వివరాలు తెలిపితే మీరు దేశానికి సాయం చేసినవారవుతారని ఆచార్యులకు బోధపరిచారు.

 

ఆ మాటలకు సంతృప్తి చెందిన ఆచార్యులు ఇలా సెలవిచ్చారు అయ్యా ఈ బృందావనం విజయనగర రాజుల కాలం నాడు కట్టించినది దీని కింద ఆ రాజులు ఆలయానికి ఇచ్చిన వజ్రవైఢూర్యాలు రత్నాభరణాలు బంగారు నాణాలు రెండు రాగి బిందెలలో దిగ్భందించి భద్రపరిచారు. మొన్న పడిన పిడుగు ధాటికి ఆ బృందావనం కూలిపోతే మరమ్మత్తులు చేయించి పునః ప్రతిష్ట చేయించాము మీరు మళ్ళీ దానని పాడుచేయవద్దని ప్రాధేయపడ్డాడు. శాస్త్రవేత్తలకు మొత్తం విషయం అర్థమైపోయింది. అప్పుడు వాళ్ళు ఆచార్యులకు ఇలా చెప్పారు. స్వామి మరేం ఫరవాలేదు మీ సంపదకు వచ్చిన నష్టమేమీలేదు, బృందావనం కింద ఉన్న రాగి బిందెలు పిడుగుపాటుతో కాపర్ ఇరీడియంగా మారిపోయాయి అందువల్ల మేము ఆ బిందెలను మాత్రమే తీసుకుని మిగతా సంపదను యధాతధంగా భద్రపరిచేస్తాము అని అన్నారు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన ఆచార్యులు కాపర్ ఇరీడియం అంటే ఏమిటి అది ఎలా ఏర్పడుతుంది వివరాలు తెలపవలసినదిగా అడిగారు.

 

అందుకు ఒక శాస్త్రవేత్త ఇలా వివరించాడు స్వామీ మన పూర్వీకులనాటి రాగి చాలా స్వచ్ఛమైనది ప్రాచీనమైనది కదా. అది చాలా ఏళ్ళపాటు భూమిలోని ఉన్నందువల్ల భూగర్భంలో జరిగే అనేక రసాయనిక చర్యలకు లోనవుతుంది. అందువల్ల ఆ రాగి పిడుగులో ఉండే మొత్తం శక్తిని తనలో ఇముడ్చుకొనే విధంగా తయారవుతుంది. ఇలా తయారైన రాగి పాత్రలు గాని, నాణేలు గాని, పిడుగుపాటు కారణంగా కాపర్ ఇరీడియంగా మారడానికి అవకాశముంది. అయితే ఇక్కడ మీకొక సందేహం రావచ్చు రాగి మాత్రమే ఎందుకు ఇలా రూపాంతరం చెందుతుందని, మిగిలిన లోహాలతో పోల్చుకుంటే రాగి స్వతహాగా విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. మీరు గమనించినట్లైతే మనకు సాధారణంగా కరెంట్ తీగలలో రాగి తీగలనే ఎక్కువగా వాడతారు, కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక పిడుగులో 1000 జిగా వాట్స్(10^12) ల కన్నా ఎక్కువ విద్యుచ్ఛక్తి నిక్షిప్తమై ఉంటుంది. మీకు ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే ఒక పిడుగులో ఉండే విద్యుచ్ఛక్తిని అమెరికా మొత్తానికి 20 నిముషాల పాటు కరెంటు ఇవ్వవచ్చు అంత శక్తి కలిగి ఉంటుంది. ఇంత శక్తిని ఒక్కసారిగా తనలోకి నిక్షిప్తం చేసుకునేటప్పటికీ భూగర్భంలో జరిగే కొన్ని రసాయనిక చర్యల కారణంగా అది కాపర్ ఇరీడియంగా రూపాంతరం చెందుతుంది. అది ఒక రోజులో కావచ్చు పది రోజులు కావచ్చు నెల రోజులు కావచ్చు ఇలా రూపాంతరం చెందిన కాపర్ ఇరీడియం కొన్ని విచిత్రమైన శక్తులను కలిగివుంటుంది. అందువల్ల దీనిని ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి పంపే రాకెట్ లలో దీనిని ఇంధనంగా వాడతారని చెప్పుకొచ్చాడు.

 

అయితే అలా ఏర్పడిన కాపర్ ఇరీడియంను మనం తెలుసుకోవడం ఎలా అని ఆచార్యులు సూటిగా ప్రశ్నించారు శాస్త్రవేత్తల్ని, అందుకు శాస్త్రవేత్తలు స్వామీ అందుకు కొన్ని పద్దతులు ఉన్నాయి. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది రైస్ పుల్లింగ్ అంటే ఇప్పుడు మీరు చిన్ని కృష్ణుడికి పెట్టిన అటుకులు, అవి ఎలాగైతే ఒకదాని వెనుక ఒకటి ఆకర్షింపబడి ఒకదానిపైన ఒకటి నిటారుగా నిలబడ్డాయి కదా ఈ పద్దతి ద్వారా మనం అది కాపర్ ఇరీడియంగా గుర్తించవచ్చు. ఇంకా ఇలా ఏర్పడిన ఇరీడియం ఉన్న దగ్గర మరే ఇతర విద్యుచ్ఛక్తి పనిచేయదు, అని మరికొన్ని పద్దతులను వివరించాడు. శాస్త్రవేత్తలతో సమావేసానంతరం ఆచార్యులు ఆ ఇరీడియంను వెలికి తీయడానికి అంగీకరించాడు.

 

వెంటనే డి.ఆర్.డి.ఒ శాస్త్రవేత్తల బృందం ఆ కాపర్ ఇరీడియంను వెలికి తీయడానికి సన్నాహకాలు చేసుకున్నారు. అందుకు తగిన సామగ్రిని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండీ తెప్పించుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆలయంలో తవ్వకాలు మొదలుపెట్టి మధ్యాహ్నంకల్లా ఆ కాపర్ ఇరీడియం బిందెలను తీసి భద్రపరిచి అందులో ఉన్న భాండారాన్నంతా వేరే వాటిలోనికి మర్పించి యధాతధంగా ఆ బృందావనాన్ని పూడ్చిపెట్టారు. తరువాత శాస్త్రవేత్తలంతా భద్రపరిచిన కాపర్ ఇరీడియంను హెలీకాఫ్టర్లో తీసుకుని వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ తరువాత ఈ కాపర్ ఇరీడియంకు తగిన మొత్తాన్ని ఆ ఆలయానికి సమర్పించి అందులో కొంత మొత్తాన్ని ఆచార్యులకి కూడా ఇచ్చారు. తనకు వచ్చిన సొమ్మును శ్రీధరాచార్యులు ఆలయానికి ఇచ్చి ఆలయ ధర్మకత్తలతో కలిసి ఆ సొమ్మును అనేక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ స్వామి వారి సేవలో తరించారు.

రచన

చంద్రమౌళి రెడ్లం

పలమనేరు

నా గుండెనే ఖైదు చేసావే

ఓం శ్రీ సాయిరాం 

నా గుండెనే ఖైదు చేసావే






పల్లవి

ఊసుపోనీయకా నా గుండెనే ఖైదు చేసావే
వేట కొడవళ్ళలా నీ కళ్ళతో మనసు కోసావే

అనుపల్లవి

పరుగులు తీసే వయసుకు ఎవరో కళ్ళెం వేసేట్టు
ఉన్నట్టుండి పెదవుల గడపన నవ్వులు తుళ్ళేట్టు
నా వయసు కలిసిన జతలో తీయని అగచాట్లు

|| ఊసుపోనీయకా ||

చరణం ౧

తెల్లవార కుండానె పిలుపు
తలుపు తట్టి లేపింది వలపు
వల్లకాదు పొమ్మంటు వెలుగు
కునుకుతీయ రమ్మంటు పలుకు
ఇన్నినాళ్ళుగా అందమైన ఈ ఊహే లేదు
నేను నేనుగా లేనె లేనుగా ఇది తెలిసే వరకు
ఆ చిట్టి చిలకమ్మ నా చేతికందేనా
తన దోర పెదవుల్ని నే దోచుకోగలనా
నాలోవున్న నీ మౌనాన్ని జాగృతి చేస్తున్నా

|| ఊసుపోనీయకా ||

చరణం ౨

ఎల్లోరా శిల్పాల సొగసు
సాటిరాదు నీ అందె లయకు
పీకాసో చిత్రాల తళుకు
తక్కువేను నీలోని కళకు
ఇంత అందము కంటపడగనే దోచే కళ్ళు
నా చేతివేళ్ళతో దిష్టి తీయగా భాగ్యమివ్వు నాకు
తన మౌన భాష్యాలు ఒకమాట తొడిగేనా
ఆనంద సమయాలు నా సొంత మయ్యేనా
తనతో జతగా నడిచే దిశగా పయనం చేస్తున్నా

|| ఊసుపోనీయకా ||

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు


Wednesday 10 July 2019

మౌనమా ప్రియతమా

ఓం శ్రీ సాయిరాం

మౌనమా ప్రియతమా


 


మౌనం తన భాషేనా మాటకు యెడబాటేనా
పలికే భావాలన్నీ కన్నుల కదలికలేనా
ప్రియతమా...

****
 
ఎందరిలో నే వున్నా అందెల సవ్వడి విన్నా
ఆశగా నా కళ్ళు వెదికేను నీకై దిశలు
ప్రియతమా ...

****
 
అల్లన నిను చూడంగా ఝల్లున ఎగసే మనసు
అనుకోని ఆనందాన్ని తనలోన చవిచూసిందే
ప్రియతమా ...

****

చూపులు కలిసే వేళ ఊపిరి వరదౌతుంటే
ప్రాణం చెరిసగమై ప్రేమగా చిగురించిందే
ప్రియతమా ...

****

నవ్విన నిను చూడంగా యవ్వన మేఘామృతము
వలపుల చందనమద్ది మనసును తడిపేసిందే
ప్రియతమా ...

****

ఎదురే పడగా నీవు యెదలో యేమౌతుందో
తెలిపే భాష నేనైతే ప్రేమే కవితయ్యిందే
ప్రియతమా ...

****

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

ఎవరీ ప్రియ భామిని


ఓం శ్రీ సాయిరాం

ఎవరీ ప్రియ భామినీ

 

 

 పల్లవి

ఎవరీ ప్రియ భామినీ...
చిరు నగవుల సొగసుల ఆమనీ...
ఎవరీ ప్రియ భామినీ...

చరణం - 1

అందరాని చందమామ ఆమె మోమై తోచినట్టు
ఏటవాలు కళ్ళతోనే పిలువకున్నా పిలిచినట్టు
తొలకరింత చిలికినట్టు మనసుకేదో తుళ్ళిపాటు
అనిముషులల్లే నిలిచిపోతి కళ్ళార తనరూపు చూడాలని  

చరణం - 2

ముద్దబంతి బుగ్గలందు కన్నెయీడు నుగ్గులేసే
ఇంద్రధనస్సు రంగుమారి ఆమె కనులా బొమ్మలాయే
బాల అరుణ బింబమేమో నుదుటిపైనే కుంకుమాయే
అనిముషులల్లే నిలిచిపోతి కళ్ళార తనరూపు చూడాలని  


రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు
 

Wednesday 15 May 2019

ఉదయించిన కిరణాన్ని


ఓం శ్రీ సాయిరాం

ఉదయించిన కిరణాన్ని


కన్నాను నే కలలెన్నో
నెరవేర్చే దారులలో అడుగడుగు తడబడుతూ
నిరుపేదను స్థితిలో నేను తలవంచని గగనాన్ని
నిదురించిన స్వప్నం కోసం ఉదయించిన కిరణాన్ని
 ***
జీవిత మధనం చేస్తూ కష్టాలను చవిచూసేవురా
గుండెకు ధైర్యం పోస్తూ మరణాన్నే గెలుపొందేవురా
బ్రతుకంటేనే పెను సవాళ్ళు... పోరాడి గెలుపొందరా...
***
కాటుక చీకటి లోకం ఓ కోడై కూతలు కూయగా
కంటికి నిద్దుర లేక నడిరేయంతా వగచేవురా
ఆ క్షణాన శిశిరమౌతున్నా... చైత్రాలు వికశింపవా
 ***
ఆటూ పోటుల నడుమ పడి లేచే కెరటం జీవితం
కాలం నెమరేస్తున్నా అణువణువు పొందిన జ్ఞాపకం
ఓటమెదురైన గెలుపునీదైన నేర్చుకోవాలి పాఠాలురా
 ***
గెలిచే పిలుపు నిన్ను కనులారా చూడాలందిరా
ఓటమి కౌగిలి వీడి నీ ఉనికిని చాటు ముందరా
ఉదయ కిరణాన్ని కనగ ఇకనైన నీ దారి మళ్ళించరా 
 ***
దూరంగుందనుకుంటే జడివానే నేలను చేరునా
భారంగుందనుకుంటే ఈ మన్నే నిన్ను మోయునా
అలసిపోతున్నా ఆశ బతికున్నా దూర భారాలు కడతేరవా
 ***
జీవించాలని ఉందా ప్రతి నిత్యం పోరాడాలిరా
ఆశల తీరం వెంట నీ అడుగులు వేస్తూ సోదరా
పడిలేస్తున్నా... పరుగుతీస్తున్నా... విజయాల తీరానికే

రచన
చంద్రమౌళి రెడ్లం


Wednesday 3 April 2019

భావుక గీతం

ఓం శ్రీ సాయిరాం

భావుక గీతం


పల్లవి

ఎందరి అనుబంధం 

పెనవేసిన భావుక అరవిందం

చల్లని సాయంత్రం 

నను అల్లిన మల్లెల సుమగంధం

 

చరణం-1

తొలకరి చినుకుల మేఘం

భువి మదిలో వేసిన బీజం

కవిలో సిరి మువ్వల నాధం

అక్షరమే అలరారు తీరం

 

చరణం-2

వెదుకాడే వెన్నెల కోసం 

పూర్ణోదయ చంద్ర వికాశం

శశి కాంతిలో చకోరం

భావుకలో మన మానస తీరం

 

చరణం-3

ఉదయించిన కలల ప్రపంచం

తెలుగుదనానికి ప్రతిబింబం

ఎటు చూసినా విరిసే వసంతం

గ్రోలిన మధురస భావ విలాసం

 

చరణం-4

పదుగురు పంచిన భాష్యం

ప్రతి మదినీ మీటిన హాస్యం

ఝరిలో పదమంజరి లాస్యం

భావుక నవరస నర్తన మాధ్యం 

రచన

చంద్రమౌళి రెడ్లం

పలమనేరు

Thursday 10 January 2019

లాస్య గీతం

ఓం శ్రీ సాయిరాం

లాస్య గీతం

పల్లవి

అరుణబింబ మంబరాన 
అతిశయంగ అలసి సొలసి
సంధ్య వేళ సొమ్మసిల్లి 
ఛాయ చెంత సేదదీరి
కిరణమొకటి పట్టుదప్పి జారిందంట
శ్రీ దివ్య దోసిట్లో చేరిందంట

||అరుణబింబ మంబరాన||

చరణం 1
స్వాగతాల భంగిమలో సంధ్యకాల వందనాన
సూర్యుడినే హారతిగా ఇస్తూ వుంటే
కృష్ణమ్మ హొయలన్నీ వేళ
తనలోనే పొదిగింది బాల
కెరటాలను తన కాలికి ముడివేసింది
భరతం తన పదమందున ప్రభవించింది
తా...తై... తక... ఝం... ఝం... ఝం...
తా...తై... తక... ఝం... ఝం... ఝం...

||అరుణబింబ మంబరాన||

చరణం 2
 
అభినయించు అంగాంగం రసవిధ్యా సంగమమై
లావణ్యం లాస్యంతో లయమౌతుంటే
కృష్ణమ్మా ఒడిలోనీ వేళ
తాండవమే చేసిందీ బాల
హృదయం పరవశమై తను నర్తిస్తుంటే
చరణం శ్రుతి లయలై నది రవళిస్తుంటే 
గీతం... ధ్వనియించింది...
నాలో... జనియించింది...

||అరుణబింబ మంబరాన||

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు